||సుందరకాండ. ||

||తత్త్వదీపిక - పదహేనవ సర్గ ||

||సీతా సందర్శనము||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ పంచదశస్సర్గః

తత్త్వదీపిక
సీతా సందర్శనము.

ఇది సీతా సందర్శన సర్గ

అన్ని అంగములలో ఆనందముతో పులకితుడైన హనుమంతుడు
ఆ అశోకవనములో శింశుపా వృక్షముపై కూర్చుని
పరిసర ప్రాంతములు అన్నీ మరల మరల చూడసాగెను.

ఆ అశోక వనము సంతానక లతలతో కూడిన వృక్షములతో శోభిస్తున్నది.
దివ్యమైన వాసనలుగల పిల్ల వాయువులతో నిండినది.

ఆ అశోకవనము నందనవనముతో సమానముగా శోభిస్తున్నది.
నందనవనము దేవతల వనము.
అంటే ఇక్కడ ఆ దేవి ఉండతగిన వనము అని స్ఫురిస్తుంది.

మృగములతో, పక్షుల తో, కోకిలల కిలకిలారావముతో నిండినది.
ఆ అశోకవనికలో మేడలు మిద్దెలు కూడా ఉన్నాయి.
ఆ అశోకవనిక బంగారురేకులు గల పద్మములతో నిండిన చెరువులతో శోభిస్తున్నది.
ఆ అశోకవనిక అనేకమైన ఆసనములతో భూగృహములతో కూడినది.
అలాగ అన్ని ఋతువులలో పుష్పించు కుసుమములు పుష్పములు ఫలములు కలది.
రమ్యమైన ఉదయభానుని కిరణములను ప్రజ్వలిస్తూ వున్నది ఆ అశోకవనము.

ఆ వనము క్రింద నించి పై దాకా పుష్పములతో నిండిన,
శోకమును నాశనము చేయు అశోకవృక్షములతో నిండి యున్నది.
అంటే సీతాన్వేషణ ఫలించలేదు అను శోకమును
నాశనము చేయుటకు తగిన వనము అన్నమాట.

ఆ అశోకవనము బాగా పుష్పములతో విరబూచి పుష్పభారముతో
భూమిని స్పృశించుచున్నవా అన్నట్లు వున్న కర్ణికార, కింశుక వృక్షములతో నిండి యున్నది.
అంటే దుఖభారముతో వంగిపోయిన సీతవలె వున్నవా అనిపిస్తున్నదన్నమాట.
ఆ వృక్షముల కాంతులతో ఆ ప్రదేశము అంతా ప్రజ్వలిస్తున్నట్లు వుంది.
అంటే సీతాదేవి కాంతులతో ఆ ప్రదేశము అంతా ప్రజ్వలిస్తున్నదన్నమాట.
అక్కడ వేలకొలది వున్న అశోకవృక్షములలో కొన్ని బంగారుకాంతులతో సీతవలె శోభిస్తున్నాయి.
కొన్ని దుఃఖముతో ప్రజ్వలిస్తున్న సీతలాగా , అగ్నిశిఖలులాగ వున్నాయి.

వివిధ ఉద్యానములతో వున్న ఆ అశోక వనము నందన ఉద్యానము వలె నున్నది.
అనేకరంగులుకల ఆ ఉద్యానము కుబేరుని చైత్రరథము వలె నున్నది.

ఆ వానరపుంగవుడు ఆ అశోకవనిక మధ్యలో దగ్గరలోనే వేయి స్తంభములతో తెల్లని కైలాసములా వున్న, పగడములతో చేయబడిన మెట్లు కల,
బంగరుపూతలతో చేయబడిన వేదికలు కల,
కళ్ళకి మిరుమిట్లు గొలిపే ఆకాశమును అంటుచున్నదా అని ఉన్నట్లు వున్న
ఒక పెద్ద చైత్యప్రాసాదమును చూచెను.

ఆ ప్రాసాదము కైలాసము వలె వున్నదన్నమాట.

అక్కడ మలినవస్త్రములు ధరించిన,
రాక్షసస్త్రీలతో చుట్టబడియున్న,
ఉపవాసములతో కృశించియున్న,
దీనముగా మరల మరల నిట్టూర్పులు విడుచుచున్న,
శుక్లపక్షములో నిర్మలమైన చంద్రరేఖవలె వున్న,
ఒక స్త్రీని హనుమంతుడు చూచును.

పొగచే ఆవృతమైన పొగజ్వాలవలె ఆమె సౌందర్యము స్పష్ఠముగా కానరాక ఉన్నది.

జీర్ణించిన ఒక ఉత్తమ తరగతి పీత వస్త్రమును ధరించియున్న ఆవిడ,
అలంకారములు లేకుండా పద్మములు లేని తామరకొలను వలె నున్నది.
ఆమె దుఃఖములో మునిగి తలవంచుకొనియున్నది.
తపస్వినివలె నున్నది.
అంగారకగ్రహముచేత పీడింపబడిన రోహిణి వలె నున్నది.

ఆమె దుఃఖభారముతో నీళ్ళతో నిండిన కళ్లతో,
ఉపవాసములతో కృశించి, దీనముగా ప్రతిక్షణము ధ్యానములో ఉన్నది.

ఆమె ప్రియమైన జనులు కానరాక రాక్షసీగణములనే చూస్తూ ,
ఆమె తన మందనుంచి విడిపోయి వేటకుక్కలతో చుట్టబడియున్న ఆడ జింకవలె ఉండెను.
జఘనము వఱకు వేలాడుచున్న నల్లని పామువలె ఉన్న ఒంటిజడతో వున్న ఆమె,
శరద్ ఋతువులో వున్న వృక్షపంక్తితో కూడిన భూమివలె నున్నది.

అధికమైన మలముతో కృశించియున్న ఆ విశాలాక్షిని చూచి, ఈమె సీతయా అని తర్కించ సాగెను.
' ఈ అంగన ఆ కామరూపి అగు రాక్షసుని చేత తీసుకోపోబడిన
సీత రూపము కలది గా కనపడుచున్నది' అని అనుకొనెను.

ఆమె పూర్ణచంద్రుని వెన్నెలవలె జగత్తులోని సమస్త ప్రాణులకు ప్రీతిపాత్రురాలు.
నియమవతి అయి తపస్విని వలె ఆమె భూమి మీద కూర్చుని ఉన్నది.
భయపడుతూ బుసలు కొడుతున్న భుజగేంద్రు ని పత్నివలె నిట్టూర్పులు విడుచుచున్న ఆమె,
పెద్ద శోకముతో ప్రకాశవిహీనముగా వున్నది.

ఆమె ధూమ్రజాలముచేత కప్పబడిన అగ్నిశిఖవలెనున్నది.
సందిగ్ధమైన అర్థముగల స్మృతి వాక్యమువలె నున్నది.
తరిగిపోయిన ఐశ్వర్యము వలె నున్నది.
అధికమైన అవిశ్వాసముచే చెడిన శ్రద్ధవలెనున్నది.
కార్యము ఫలించని ఆశవలె,
విఘ్నము కలిగిన సిద్ధివలె ,
కలుషమైన బుద్ధివలె నున్నది.
అసత్యమగు అపవాదముచే క్షీణించిన కీర్తివలె వున్నది.

రాక్షసునిచే అపహరింపబడి రాముని ఎడబాటుతో కృశించి వున్నది.
లేడి కన్నులతో ,భాష్పములతో నిండిన నల్లని కనుబొమ్మల కల అమె,
ప్రసన్నముకాని వదనముతో మళ్ళీ మళ్ళీ నిట్టూర్పులు విడుచుచూ వున్నది.

మననము చేయకుండా వున్నందువలన మరుగుపడిన విద్య
పునశ్చరణ లో కలుగు సందేహము వలె,
ఆ సీతను చూచి హనుమంతుని మనస్సులో పదే పదే
ఈమె సీతయా అని సందేహము కలుగుచుండెను.

అలంకారము లేక సంస్కారరహితమై కృశించి ఉన్నఆమెను,
అర్ధము లోపించిన శబ్దమును కష్టముగా అర్థముచేసికొనినట్లు,
ఆమె యే సీత అని అతి దుఃఖముతో తెలిసికొనగలిగెను.

అప్పుడు రాముడు వైదేహి అంగములలో ఏ ఏ ఆభరణములు కీర్తించెనో,
వానితో శోభించుచున్న అంగములను చూచెను.

సుకృతమైన కుండలములతో,
చక్కగా ఉన్న శ్వదంష్ట్రములతో,
హస్తములమీద మణులతో రూపొందించబడిన ఆభరణములు,
చిరకాలము ఉపయోగించడము వలన మాసిపోయి,
శరీరము మీద మచ్చలు చూసెను.

రాజపుత్రి విశాలాక్షి అగు ఆమెని చూచి
ఈమె సీత అని అనేక కారణములతో ఆలోచించ సాగెను.

'అవి రామునిచే వర్ణింపబడినవే అని అనుకుంటాను.
అప్పుడు క్రిందపడవేసినవి నాకు ఇప్పుడు కనపడుట లేదు.
మిగిలిన ఆభరణములను మాత్రమే చూచుచున్నాను.
ఆ పచ్చని బంగారు వన్నెగల ఆ శుభమైన ఉత్తరీయమును
అప్పుడు సీత జారవిడచగా వానరులచే చూడబడినది.
తీసుకుపోబడుతూ ధరణీ తలము మీద చప్పుడు చేస్తూ పడవేయబడిన
అమూల్యమైన ప్రధానమైన ఆభరణములను వానరులు చూచిరి.
చాలాకాలము ధరింపబడిన ఈ వస్త్రము క్లిష్టముగా ఉన్నది.
అయినప్పటికీ దాని రంగు కాంతి అప్పుడు ఎలాగవున్నదో ఇప్పుడు అలాగే ఉన్నది.
ఈ బంగారువన్నెగల అవయవములతో నున్న రాముని పట్టమహిషి
అపహరింపబడినప్పటికీ ఆయన మనస్సులో చెక్కు చెదరకుండా ఉన్నది'.

' తను రక్షించవలసిన ఆమె అపహరింపబడడము వలన కారుణ్యము,
తనపై అధారపడిన స్త్రీకనక దయ,
భార్య పోయినందువలన శోకము ,
తనప్రియురాలు కానరావకపోవడము వలన మదన బాధతో
అలాగ నాలుగు విధములుగా రాముడు పరితపిస్తున్నాడు.

'ఆ దేవియొక్క రూపము అంగముల సౌష్టవము ఆయన యొక్క రూపమునకు తగినట్లే ఉన్నాయి.
ఈ దేవియొక్క మనస్సు ఆయనపై అయనయొక్క మనస్సు ఈమె పై ప్రతిష్టింపబడియున్నాయి.
అందువలనే ఆ ధర్మాత్ముడు అదేవిధముగా ఆమె కూడా క్షణమైన జీవించకలుగుతున్నారు'.
ఈ విధముగా హనుమంతుడు సీతారాముల గురించి పదే పదే గౌరవాతిశయములతో అలోచించెను.

ఒకప్పుడు హనుమంతుడు మాల్యవత్పర్వతము నందు సీతావిరహముతో బాధపడుతున్న రాముని చూచెను. అప్పుడు హనుమ "ఏమి ఈ శ్రీరాముడు. ఆడుదానికై ఇంత విలపించుట ఏమి?
వశిష్ఠుని శిష్యుడు ఒక స్త్రీకై ఇంత బాధపడుచున్నాడని తనమనస్సులో పరిహాసముగా భావించెను.
కాని అ పతివ్రత అయిన సీతను చూచిన తరువాత హనుమంతుని అలోచన మారి
ఎంతో గౌరవముతో ఈ విధముగా తలుస్తాడు.

'రామచంద్ర ప్రభువు ఈమె లేకుండా తన దేహమును శోకముతో ధరించకలుగుచున్నాడు
అంటే కష్టమైన పని సాధించకలిగాడన్నమాట.
ఈ యౌవనముతో అలరారుతున్న ఈ సీతని విడచి ఒక క్షణము కూడా జీవించగలడము
మహాబాహువులు కల రాముడు ఒక చేయలేని కార్యము చేసినట్లే వున్నది".

ఈ విధముగా ఆ వాయునందనుడు ఆ సీతను చూచి
రాముని మనస్సులో తలచుకొని,
రాముని ప్రశంశించి మనస్సులో ఆనందపడెను.

అదే మనము పదహేనవ సర్గలో వినేది.

ఇది సీతా సందర్శన సర్గ.

ఇక్కడ సీత మూడు రూపములతో కనపడును.
(1) ఆమె దేవదేవుని దివ్యమహిషి అయిన లక్ష్మి
(2) ఆమెయే సీతయై అవతరించెను.కావున దేవిగా హనుమచే అరాధింపబడును
(౩) ఆమె జగన్మాత. తల్ల్లివలె సర్వేశ్వరునికి జీవులకు మధ్యవర్తి అయి జీవుని సర్వేశ్వరునితో చేర్చునదై ఉండును.

ఇట్లు ఘటకురాలై విభీషణునికి రామునితో కలయికకు పరోక్షముగా సాయపడును.

రావణుడు వినకపోయిననూ
భగవానుడగు రామునితో మైత్రి చేసికొనమని ఉపదేశించి
రామునితో ఘటనచేయ ప్రయత్నించును.

జీవుని వలె నటించుచూ
పరమాత్మకు దూరమైనపుడు జీవుడు
మరల పరమాత్మకు చేరుటకు ఏట్లు ప్రవర్తింపవలెనో అంతరంబుగా ఉపదేశించును.

బాహ్యముగా పతివ్రతయగు స్త్రీ
భర్తనుంచి దూరముగా ఉన్నప్పుడు ఏట్లు ప్రవర్తించునో ఉపదేశించెను.

ఇట్లు సీతయందు భిన్నరూపములు మనకు కనపడును.

కావున ఆమెను అన్ని రూపములతో మనము దర్శించునపుడు
అమె ఇచ్చెడి ఉపదేశములను 'గ్రహింపవలెను.

||ఓమ్ తత్ సత్||
|| ఇది భాష్యమ్ అప్పలాచార్యులవారి తత్త్వదీపికలో మాకు తెలిసిన మాట||
||ఓమ్ తత్ సత్||